మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం :- పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
May 25, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ముఖ్యమంత్రి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వంటకాల ప్రదర్శనను ఎమ్మెల్యే పరిశీలించారు. సే నో టు జంక్ ఫుడ్ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలతో తయారు చేసిన సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళా, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సాధికారతతోనే కుటుంబం, గ్రామం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమా అధికారి కృష్ణవేణి,వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, బ్లాక్ టు అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, ఏపిఎం శ్రీనివాస్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.