• ట్రాన్స్ఫార్మర్లు లైన్ఎ లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి
• ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలి
• రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి
• తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి
• విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం
(తాండూర్)
తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, నిర్వహణ, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ అంతరాయాలు తగ్గించే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.వ్యవసాయ అవసరాల కోసం రైతులకు నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ప్రమాదకరంగా మారిన లూజు విద్యుత్ వైర్లను గుర్తించి పకడ్బందీగా సరిచేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని సబ్స్టేషన్లను అవసరమైన మరమ్మతులు చేపట్టి, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ కనెక్షన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులు రూ.9,100 ప్రభుత్వానికి చెల్లిస్తే ఒక కిలోమీటరు వరకు విద్యుత్ వైరు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఈ పథకాన్ని అర్హులైన రైతులు వినియోగించుకోవాలని కోరారు.విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, విద్యుత్ అంతరాయాలు మరియు అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అదేవిధంగా, విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 132 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ రవి ప్రసాద్ , డిఈ సూర్య నాయక్ , ఎడి శంకర్ నాయక్ , అన్ని మండలాల AE ఎఈలు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, నాయకులు పాల్గొన్నారు.