ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, కుల్కచర్ల మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ :- తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్
June 10, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం నమోదు, ధాన్యం నిల్వలు, రైతులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన ఆయన ధాన్యం తూకం, తరలింపు, చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఎస్ సుదర్శన్, పిఎసిఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, పిఎసిఎస్ సీఈవో బక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.