శివసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకొండి
calendar_today
September 11, 2026
person
Prajagalam News
• శాసన మండలి లో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
(తాండూర్)
అర్ధాంతరంగా నిలిచి పోయిన శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల లో భాగంగా శాసన పరిషత్తు 26 వ సెషన్ సెకండ్ మీటింగ్ నాలుగో రోజు శుక్రవారం మండలిలో ప్యానల్ చైర్మెన్ భానుప్రసాద్ రావు అధ్యక్షతన సాగిన సమావేశం ప్రత్యేక అంశాల ప్రస్తావన లో భాగంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కాక్రవేణీ నదిపై శివసాగర్ నిర్మిస్తున్న ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచి పోయి ఇప్పటి వరకు పూర్తి కాలేదని చెప్పారు.తాండూర్ నియోజకవర్గం యాలాల మండలంలో శివసాగర్ ప్రాజెక్టు రెండు దశలుగా నిర్మాణం పనుల సాగాయన్నారు. 2006లో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 4 కోట్ల 70 లక్షల నిధులతో శివసాగర్ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. యాలాల మండలం గోవిందాపూర్, విశ్వనాథ్ పూర్ , సంఘం, హాజీపూర్, కిష్టాపూర్, గోరేపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 600 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా రెండు వేల ఎకరాల కు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్ట్ పనులు సాగాయ అన్నారు. రెండవ సారి 2018లో తాను మంత్రిగా ఉన్నప్పుడే 11 కోట్ల 41 లక్షలు శివసాగర్ కోసం మంజూరు చేయించామని వివరించారు.కాలువల నిర్మాణం, వరద నీటిని నిల్వ చేసి బయటకు పంపే అలుగు పనులతో పాటు తుమ్ములు బిగించేందుకు నిధులు మంజూరయ్యాయి అన్నారు. అనంతరం అలుగు నిర్మాణం సక్రమంగా, వేగంగా సాగక పోవడంతో వరదలకు అలుగు కొట్టుకు పోయిందని చెప్పారు. ఇంకా సుమారు 5 కోట్ల నిధులు ఉన్నా ఇప్పటివరకు కాంట్రాక్టర్ పనులను చేయడం లేదని తెలిపారు.అలాగే కాలువల నిర్మాణం సైతం సగం వరకే సాగి అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. కుడి కాలువ 4 కిలోమీటర్లు, ఎడమ కాలువ నాలుగున్నర కిలోమీటర్లు నిర్ణయించాల్సి ఉండగా రెండు వైపులా మూడు కిలోమీటర్ల వరకే పనులు సాగి మిగతా భూసేకరణ సైతం జరగకుండా కాలువల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్లుగా నిలిచిపోయాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగక పోవడంతో కాక్రవేణి నది నుండి వరద నీరు దాని ప్రధాన నదియైన కాగ్నా నదిలో కలిసి కర్ణాటక రాష్ట్రానికి వెళుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా అర్ధాంతరంగా నిలిచిపోయిన శివసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు అదనపు నిధులను మంజూరు చేసి వేయి ఎకరాల బదులు రెండు వేల భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని మహేందర్ రెడ్డి కోరారు.