schedule Friday, September 11, 2026

భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవత శ్రీ కట్టమైసమ్మ

calendar_today September 11, 2026
person Prajagalam News
భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవత శ్రీ కట్టమైసమ్మ

• మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షులు విట్టల్ నాయక్ అన్నారు.

• పొలెల అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

  (తాండూరు)   భక్తుల నమ్మకానికి కొలువైన కోరిన కోరికలు తీర్చే మహిమగల తల్లిగా శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని భక్తులు కొలుస్తున్నారని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షుడు విట్టల్ నాయక్ అన్నారు.పోలెల అమావాస్య సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంటలో కొలువుదీరిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు విట్టల్ నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తాండూరు ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా విట్టల్ నాయక్ మాట్లాడుతూ.. పోలెల అమావాస్యకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, శ్రావణమాసం ముగింపు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందన్నారు. శ్రీ కట్ట మైసమ్మ తల్లి కరుణాకటాక్షాలు తాండూరు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అల్లంపల్లి ప్రకాష్, నవీన్ కంఠం, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.